సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయ పండుగలా సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు రైతు వేదికను మంత్రులు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ కంటే రబీలోనే అత్యధిక సాగు జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక జరిగిన లాభానికి ఇదే నిదర్శనమన్నారు. దేశంలోనే వరి సాగు తెలంగాణలోనే ఎక్కువ జరిగిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. కాలానికి అనుగుణంగా రైతులూ మారాలని మంత్రి సూచించారు. ఎక్కువ లాభం వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు.
పంట పండించి సులభంగా అమ్ముకునే పంటలనే సాగు చేయాలని, రాబోయే రోజుల్లో మిర్చికి డిమాండ్ ఉంటుందని, ఈ మేరకు మిర్చి సాగుపై దృష్టి పెట్టాలన్నారు. భూసారం, సస్యరక్షణ, యాంత్రికీకరణ, సాగు మెళకువలు, మార్కెటింగ్ లాంటి అంశాలపై సమగ్రంగా రైతు వేదికల ద్వారా అవగాహన చేసుకోవాలన్నారు. మిద్దె పంటల సాగులో ముందున్న సూర్యాపేటకు అభినందనలు తెలిపారు. రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు ఆలోచించాలని, మిర్చి, కందులు, నూనె గింజ పంటల సాగు పెంచాలని, దిగుమతుల దశ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెంచే దశకు రైతులు చేరుకోవాలన్నారు. దొడ్డు రకం ధాన్యం సాగును తగ్గించాలని, భవిష్యత్లో ఈ రకం కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఉన్నత చదువులు చదివిన వారు సాగుపై దృష్టి పెట్టాలని, మూస పంటల సాగుతో లాభాలు వచ్చే రోజులు పోయాయన్నారు.
జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గతంలో లేని విధంగా పూర్తిస్థాయిలో మూసీ ఆయకట్టు రైతాంగానికి సాగునీరిస్తున్నామన్నారు. మూసీ ఆనకట్ట ఆధునికీకరణ ఘనత తమదేనన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చింది సీఎం కేసీఆరేనని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల సంక్షేమం కొనసాగుతుందని, రైతాంగాన్ని చైతన్య పరిచి వారి ఆదాయం పెంచేందుకే రైతు వేదికలని తెలిపారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జనయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, జడ్పీటీసీ జీడీ భిక్షం, ఎంపీపీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.