న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైరస్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమీక్ష జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు.
ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్లో రోజువారీ కరోనా కేసులు పెరిగాయి. నిన్న రికార్డయిన కేసుల్లో 80శాతానికిపైగా కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, పంజాబ్ల్లోనే 75.88శాతం యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే 58.23శాతం ఉన్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆదివారం రికార్డు స్థాయిలో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 8న కొవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు.