సియోల్: ఈ ఏడాది జపాన్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఉత్తర కొరియా పాల్గొనడం లేదు. కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో ఆ క్రీడలకు దూరమవుతున్నట్లు ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. 1988లో సియోల్లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ను కూడా నార్త్ కొరియా మిస్సైంది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ప్రచ్చన్న యుద్ధం నేపథ్యంలో అప్పట్లో ఆ క్రీడలను బహిష్కరించారు. అయితే ఈసారి జపాన్లో జరగాల్సిన గేమ్స్ ద్వారా తిరిగి శాంతి ప్రయత్నాలు చేద్దామనుకున్న దక్షిణ కొరియాకు విఘాతం ఏర్పడినట్లు అయ్యింది. నిజానికి ఈ రెండు దేశాలు కలిసి 2032లో సంయుక్తంగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనుకున్నాయి. కానీ ఆ ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడినట్లు అయ్యింది. ఉత్తర కొరియా తీసుకున్న నిర్ణయం పట్ల జపాన్ స్పందించింది. క్రీడల సక్సెస్ కోసం ఇతర దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు జపాన్ చెప్పింది. నిజానికి గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను కరోనా వల్ల ఈ ఏడాదికి వాయిదా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం నుంచి అథ్లెట్లను రక్షించేందుకు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రి కిమ్ గుక్ తెలిపారు.