Shrikant Shinde : కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు కొత్త కేంద్ర మంత్రి ఎవరు అవుతారు అనే అంశంపై చర్చ మొదలైంది. ఎన్డీయే ప్రభుత్వంలో ఈ పదవి చాలా కీలకం. దేశవ్యాప్తంగా నీట్ సహా అనేక పరీక్షలు నిర్వహణ, విద్యావ్యవస్థను నడిపించడం వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఏ పొరపాటు జరిగినా ఇప్పట్లాగే యువత, విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోకత్పదు. ఈ నేపథ్యంలో కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనే ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శివసేన ఎంపీ పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తనయుడు, కల్యాణ్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ శ్రీకాంత్ షిండే పేరును కేంద్రం పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఢిల్లీ వెళ్లారని సమాచారం. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వారు చర్చలు జరపబోతున్నారు.
శ్రీకాంత్ షిండేను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని వారు అమిత్ షాను కోరనున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ చేపట్టి, ఉద్ధవ్ శివసేన వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను షిండే వర్గంలో చేర్చడంలో శ్రీకాంత్ షిండే కీలక పాత్ర పోషించారు. ఈ ఎంపీల చేరికతో షిండే వర్గం ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇతర నేతల పేర్లను కూడా ప్రభుత్వ పెద్దలు పరిశీలించనున్నారు.