చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తేనాంపేటలోని ఎస్ఐఈటీ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. ఈ ఓట్లన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయన్నారు. తొలిసారిగా చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఉదయనిధి మాట్లాడుతూ ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. డీఎంకే మాజీ నేత కరుణానిధి, ఏఐఏడీఎంకే చీఫ్ జయలలిత మరణానంతరం తొలిసారిగా తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే ఉంది. తొలిసారిగా కమల్ హసన్, అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ మేనల్లుడు దినకర్ పార్టీలు సైతం బరిలో ఉన్నాయి. అయినా, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 6.28 కోట్ల మంది ఓటర్లు 3,998 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు.