హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతోపాటు పీఆర్సీ తదితర 14 డిమాండ్ల సాధన కోసం విద్యుత్తు ఉద్యోగులు ధర్నాకు సిద్ధమయ్యారు. ‘చలో హైదరాబాద్’ పేరుతో బుధవారం విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్తు సంస్థల ఉద్యోగులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీన్ర్ రత్నాకర్రావు మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు పెద్దఎత్తున హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తాము యాజమాన్యానికి నోటీసులిచ్చినా స్పందన కరువైందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మహాధర్నాకు పూనుకున్నట్టు తెలిపారు.
టీజీపీఈజేఏసీ తలపెట్టిన మహాధర్నాలో ఉద్యోగులెవరూ పాల్గొనవద్దని టీజీ జెన్కో సూచించింది. పాల్గొన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. విద్యుత్తు సౌధ, విద్యుత్తు జనరేటింగ్ స్టేషన్లు, హైదరాబాద్లోని కార్యాలయాలు, జీటీఎస్ కాలనీలోని ఈఆర్పీ కంపిటెన్సీ సెంటర్ పరిధిలోని ఉద్యోగులు ఎలాంటి నిరసనలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని గతంలోనే ఉత్తర్వులిచ్చినట్టు జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్రాజా ప్రకటించారు.