నల్లగొండ : అధికారంలో ఉన్న రోజుల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోని జానారెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దవూర మండలం తెప్పలమడుగు, లింగంపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా విప్ బాల్క సుమన్, ఎంపీ లింగయ్యయాదవ్తో కలిసి తలసాని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. నేరుగా అర్హులకే పథకాలు అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం నాశనమైందని ఆరోపించారు. నిరంతరం ప్రజలతోనే ఉండే విద్యావంతుడు, యువకుడైన భగత్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని, కాంగ్రెస్ కథ ముగిసిందని, జానారెడ్డి ఘోర ఓటమి పాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సాగర్ భూములు ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటారా? అని అన్నారు. జానారెడ్డి గెలిచి సాధించేది ఏమీ లేదని, అందుకే ప్రజలు డిసైడ్ అయ్యారని, అభివృద్ధికి జై కొడుతూ టీఆర్ఎస్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు.
జానారెడ్డికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ప్రజలను, కాలువలను ఓట్లు అడుగనంటూ ఓటర్లను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలాగే బీరాలకు పోయి ఓడిపోయారని, ఇప్పుడు భగత్లో చేతిలో ఓటమిపాలు కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలంతా గులాబీ పార్టీకి ఓటేసి గెలిపించాలని, నాన్న నర్సింహయ్యను కోల్పోయిన బాధలో మీ ముందుకు వచ్చానని, తనను మీ బిడ్డగా భావించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు.