Viral Video : కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలంటే ఇష్టపడని వారుండరు. రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మంది కోరుకుంటారు. పదవీవిరమణ పొంది పిల్లల బాధ్యతలు తీర్చిన తర్వాత తమదైన జీవితాన్ని ఆస్వాదించాలని అనుకోని వారుండరు. ఇక ఈ తరహాలో ఓ జంట టూర్కు వెళ్లి తమ వ్యాన్లోనే భోజనం తయారుచేసుకుని లంచ్ ముగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జీవితానుభవాన్ని చవిచూసిన ఈ దంపతులు రిటైర్డ్ పంజాబీ అనే తమ ఇన్స్టాగ్రాం పేజ్లో ఈ వీడియోను షేర్ చేశారు. కారులోనే ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి కిచెన్లో వీరు వంట చేసుకుని ఇష్టంగా ఆరగించడం ఈ క్లిప్లో చూడొచ్చు. తాము రిటైరైన జంటని, తమ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించామని పోస్ట్లో రాసుకొచ్చారు. తాము ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ 52 రోజుల ట్రిప్లో ఉన్నామని తెలిపారు. రోడ్ ట్రిప్లో భాగంగా వారు లంచ్ ప్రిపేర్ చేసేందుకు ఔరంగాబాద్ హైవే పక్కన కొద్దిసేపు ఆగారు.
ఈ వీడియోలో భార్య కూరగాయలను సిద్ధం చేసి వంట చేసేందుకు సన్నద్ధమవుతుండగా, భర్త సహకరించడం చూడొచ్చు. ఆపై ఇద్దరూ ఫోల్డబుల్ టేబుల్, ఛైర్స్లో సేదతీరుతూ ఆలూ గ్రేవీ డిష్ను ఎంజాయ్ చేస్తూ లంచ్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. క్యా బాత్ హై అని స్టాండప్ కమెడియన్ రవి గుప్తా కామెంట్ చేయగా, రిటైర్మెంట్ అనే పదానికి ఇదే నిజమైన మీనింగ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. చివరికి ఏదో ఒక దశలో తల్లితండ్రులు తమ జీవితాలను ఆస్వాదిస్తూ మరపురాని అనుభవాలను సొంతం చేసుకుంటారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :