లక్నో: ఒక బాలిక తన ప్రియుడ్ని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నది. నకిలీ ఆధార్ కార్డ్ సమర్పించింది. చెకింగ్ సమయంలో ఆమె జేబులో పది లైవ్ బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. (Girl Visits Jail To Meet Lover) ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రియుడైన హర్షు కశ్యప్ అనే ఖైదీని కలిసేందుకు మైనర్ బాలిక మరో వ్యక్తితో కలిసి గోండాలోని డివిజనల్ జైలుకు చేరుకున్నది.
కాగా, జైలు ప్రధాన ద్వారం వద్ద భద్రతా తనిఖీ సమయంలో ఆ బాలిక తప్పుడు వివరాలు చెప్పింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె పేరు చెప్పింది. అనుమానించిన జైలు సిబ్బంది ఆ బాలికను తనిఖీ చేశారు. ఆమె జేబులో పది లైవ్ కార్ట్రిడ్జ్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఆ బుల్లెట్లు, నకిలీ ఆధార్ కార్డుతో పాటు ఆమె వద్ద ఉన్న కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్కు అప్పగించారు.
మరోవైపు విచారణ సమయంలో ఆ బాలిక తన అసలు వివరాలు వెల్లడించింది. తన వద్ద లభించిన తూటాలు తన తండ్రికి చెందిన లైసెన్స్ పిస్టల్కు సంబంధించినవని చెప్పింది. తన తండ్రికి కోపం ఎక్కువని, జైలులో ఉన్న తన ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే తనను ఏమైనా చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆ తూటాలను పిస్టల్ నుంచి తీసి తనతో పాటు తీసుకువచ్చినట్లు ఆ యువతి వివరించింది. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైలు అధికారి వెల్లడించారు.