Viral news : పుస్తకం చదవడమంటే ఒకప్పుడు చాలామందికి ఇష్టం ఉండేది. కానీ స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోయింది. ఖాళీ సమయం దొరికినా గంటలతరబడి రీల్స్ చూస్తూ సమయం గడిపేవారే తప్ప.. పుస్తకాలు చదివే వారు అరుదుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగపూర్ సర్కారు ఓ సరికొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. రోజుకు కనీసం 15 నిమిషాలు పుస్తకం చదివేవారికి రివార్డు కింద వర్చువల్ నాణేలు అందిస్తున్నది.
సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు సెప్టెంబర్ 6న ‘రీడ్ఎస్జీ’ పేరుతో ఐదేళ్ల జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే సమయంలో తొలిసారిగా నేషనల్ రీడింగ్ మంత్ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రభుత్వ ‘క్రౌడ్టాక్ ఎస్జీ’ ప్లాట్ఫామ్లో రోజూ కనీసం 15 నిమిషాలు చదివిన సమయాన్ని నమోదు చేయాలి. ఇలా చేస్తే 20 వర్చువల్ నాణేలు వస్తాయి. 1,000 నాణేలను ఒక సింగపూర్ డాలర్గా మార్చుకోవచ్చు. రోజుకు ఒకసారి మాత్రమే చదివిన సమయాన్ని లెక్కలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం రీల్స్, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్లతో ప్రజల స్క్రీన్ సమయం పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎక్కువసేపు ఒకే అంశంపై దృష్టిపెట్టి చదివే అలవాటును పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2024 లో నేషనల్ లైబ్రరీ బోర్డు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సింగపూర్లో పుస్తకాలు చదివేవారి సంఖ్య 28 శాతమే. వారిలో 89 శాతం మంది పెద్దలు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు చదువుతున్నారు. నిర్వాహకులు చిన్నదైన 15 నిమిషాల లక్ష్యాన్ని నిర్ణయించారు.
రైలు ప్రయాణంలో, బస్సు కోసం ఎదురుచూసే సమయంలో లేదా కాఫీ తాగే విరామంలోనూ చదివేలా లక్ష్యాన్ని రూపొందించారు. ‘రీడ్ ఫర్ గుడ్’ కార్యక్రమం ద్వారా నమోదైన పఠన సమయం స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. మొత్తం 75 లక్షల నిమిషాల పఠన సమయం నమోదైతే ఎంపిక చేసిన సామాజిక కార్యక్రమాలకు గరిష్ఠంగా 1.5 లక్షల సింగపూర్ డాలర్ల వరకు నిధులు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మక దశలో ఉంది. పాల్గొనేవారి సూచనల ఆధారంగా ఇందులో మరిన్ని మార్పులు, కొత్త ఫీచర్లు తీసుకురానున్నారు.