ఇంఫాల్: మణిపూర్లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం కలకలం రేపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే చాలా తక్కువగా పరిహారం ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. (Deaths In Manipur Relief Camps) మణిపూర్లో 2023లో జరిగిన జాతి హింసాకాండలో వందలాది మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సహాయ శిబిరాల్లో వారు తలదాచుకున్నారు. అయితే సహాయక శిబిరాల్లో నివసించే ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం ఆందోళన రేపింది. ఇది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.
కాగా, మణిపూర్లో జాతి హింసాకాండపై దర్యాప్తు , మహిళలపై లైంగిక దాడులు, రక్షణ, సహాయం, పునరావాసానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సహాయక శిబిరాల్లో 25 అసాధారణ మరణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. శిబిరాల్లో మరణాలకు దారితీసిన పరిస్థితుల వివరాలు, పోస్ట్మార్టం నివేదికలు, శిబిరాలలో నివసిస్తున్న నిర్వాసితుల రక్షణకు తీసుకున్న చర్యలను కోర్టు కోరింది.
మరోవైపు మణిపూర్ వ్యాప్తంగా సహాయక శిబిరాల్లో నమోదైన మరణాలపై పరస్పర విరుద్ధమైన గణాంకాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఎనిమిది జిల్లాల్లో 640 మరణాలు సంభవించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన మరో నివేదికలో శిబిరాల్లో 608 మరణాలు సంభవించినట్లు ఉన్నది.
అయితే కేవలం 20 కేసుల్లో మాత్రమే పోస్ట్మార్టం పరీక్షలు నిర్వహించినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో అసహజ మరణాలన్నిటికి పోస్ట్మార్టం పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.
అలాగే అసహజ మరణాల కేసుల్లో కేవలం రూ. 20,000 నుంచి రూ. 30,000 మాత్రమే పరిహారం చెల్లింస్తున్నట్లు వచ్చిన వార్తలపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసహజ మరణాలన్నింటిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడాలని మణిపూర్ న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది.