Dimple Yadav : కన్నౌజ్ నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నామినేషన్ వేయడంతో బీజేపీ వెన్నులో వణుకు మొదలైందని ఎస్పీ నేత, అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా యూపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పారు. తొలి దశ పోలింగ్ అనంతరం కాషాయ పార్టీలో భయం మొదలైందని పేర్కొన్నారు.
కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బీజేపీలో వణుకు మరింత పెరిగిందని ఆమె అన్నారు. ఇక అంతకుముందు ఆగ్రాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాలేరాసే కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని ప్రధాని ఆరోపించారు. యూపీలోని ఆగ్రాలో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కులను లాగేసుకుందని, ఆపై దేశవ్యాప్తంగా ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలను వంచించేందుకు అలాగే చేయాలని భావిస్తోందని ఆరోపించారు.
కర్నాటకలో ముస్లింలందరినీ ఓబీసీ జాబితాలో చేర్చుతూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుందని వివరంచారు. కాంగ్రెస్ ఓబీసీల హక్కులను కాలరాసిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోనూ ఈ క్రీడను రక్తికట్టించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్ ఈ పనికి తెగబడుతుందని అన్నారు. కాంగ్రెస్కు ఎస్పీ వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
Read More :
Vamshi Paidipally | బాలీవుడ్ వెళ్తున్న టాలీవుడ్ స్టార్ దర్శకుడు.?