Naga Babu | జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా కొణిదెల నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఈ పదవికి ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. దీంతో నాగబాబుకు కీలక ప్రభుత్వ బాధ్యత దక్కినట్లయింది. రాష్ట్రంలో హరితాభివృద్ధి, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసింది. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం ఫారెస్ట్, ట్రీ కవర్ సాధించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రీన్ సొసైటీ రాష్ట్రంలోని పచ్చదనం పెంపు, అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమన్వయంతో హరిత కార్యక్రమాలను అమలు చేయనుంది. గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రీన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, వివిధ సంస్థల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఈ సొసైటీ కీలకంగా వ్యవహరించనుంది.
కొణిదెల నాగబాబు 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. అదే ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగబాబు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. గతేడాది మార్చిలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అనంతరం ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగింది. తాజాగా ప్రభుత్వం ఆయనను ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా నియమించడంతో ఆ ప్రచారానికి భిన్నంగా కీలక బాధ్యతను అప్పగించినట్లయింది.