Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దని వారు సూచించారు.
అయితే ఈ వివాదంపై అనసూయ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనను విమర్శిస్తున్న వారికి కూడా ఆమె ఘాటైన రీతిలో స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ‘‘దొంగలంతా బయటకు వస్తున్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. అనసూయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మొదలైన వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఫిర్యాదుపై విచారణ చేపడతారా? అనసూయను వివరణ కోరుతారా? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
మరోవైపు, ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయా అనే ఆసక్తి కూడా నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనసూయకు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు స్పందిస్తుండటంతో ఈ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.