Viral News : జపాన్ (Japan) లో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోటో హషిమోటో (Koto Hashimoto) అనే జపాన్ మహిళ ఏకంగా 7వ బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. దేశం కోసం పిల్లలను కనాలని కూడా ఆమె సోషల్ మీడియా (Social Media) వేదికగా పిలుపునిచ్చింది. తాను ఏడో బిడ్డకు జన్మనిచ్చానని, జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన తన బిడ్డకు అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరింది.
‘నేను 7వ బిడ్డకు జన్మనిచ్చాను. జపాన్ పౌరుడిగా ప్రయాణం ప్రారంభించిన నా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి. నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి ఇప్పటికే అండగా నిలబడిన మీ అందరికీ ధన్యవాదాలు. మన దేశం కీలక దశకు చేరుకుంది. జపాన్ మహిళలు పిల్లలను కనాలి. మనదేశ ఉత్తానపతనాలు మహిళలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఆమె పేర్కొంది. సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రభుత్వ చేపడుతున్న చర్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది.
తోడు కోసం వెతుక్కుంటున్న వారి కోసం కాస్మెటిక్ సర్జీలపై కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించాలని సూచించింది. ఇలాంటి చర్యలతో జనాల ఆకర్షణీయత పెరుగుతుందని చెప్పింది. ఫలితంగా పెళ్లిళ్లు చేసుకునే జంటల సంఖ్య పెరిగి సంతానోత్పత్తి రేటు కూడా పెరుగుతుందని వివరించింది. ఇలాంటి వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉందని తెలిసినా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా పంచుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నది.
జపాన్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది అక్కడ 6.71 లక్షల మంది జన్మించారు. అంతకుముందు ఏడాది 2025తో పోల్చిచూస్తే జననాల సంఖ్యలో 15 వేల మేర కోత పడింది. వార్షిక జననాల సంఖ్య తగ్గడం ఇది వరుసగా 7వ సారి. 1899 తరువాత అత్యంత తక్కువ జననాలు 2025లో నమోదయ్యాయి. ఓ దశ తరువాత జనాభా తగ్గుదలను నిలువరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు మహిళలకు పలురకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.