Sunitha Laxma Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తన చీర లాగి అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముందు ఆమె కంటతడి పెట్టుకోవడం కలకలం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఇందులో భాగంగా సునీతా లక్ష్మారెడ్డి నల్ల చీర ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో చీర లాగి అవమానించారని ఆమె ఆరోపించారు. పోలీసుల తీరుపై సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముందు ఆమె కంటతడి పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలాగేనా వ్యవహరించేదని పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమెను సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు.
అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
కౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఇవాళ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎలాగూ మహిళలకు భద్రత లేదని.. శాసనసభలో కూడా భద్రత లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మేం నల్లటి టీషర్ట్ కూడా ధరించలేదు.. అయినా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని అన్నారు. ఇదేనా ప్రజాపాలనలో మహిళలకు దక్కే గౌరవమని ప్రశ్నించారు.
నిరసన చేయడానికి మాకు హక్కు లేదా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తోసేస్తున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలన గురించి కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ అసలు నిజాలు తెలుస్తాయనే తమను అసెంబ్లీకి రానివ్వడం లేదని ఆరోపించారు.
మరోవైపు బ్లాక్ టీషర్టులు ధరించి వచ్చిన హరీశ్రావు, అనిల్ జాదవ్ను పోలీసులు అసెంబ్లీ ఎదుట అడ్డుకున్నారు. బ్లాక్ టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో హరీశ్రావు టీషర్ట్ విప్పి బనియన్పై నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆయన్ను మెయిన్ గేటు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో జగదీశ్ రెడ్డి కాలికి గాయమైంది. ఈ ఘటనతో అసెంబ్లీ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఇంతకు ఇంతా చెల్లిస్తామని హెచ్చరించారు.