శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. లోయలో ఈ ఏడాదిలో 66 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గత నెల జూన్లో 11 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అత్యధికంగా ఏప్రిల్ నెలలో 17 మందిని సైన్యం హతమార్చింది. పుల్వామా జిల్లాలోని రాజ్పోరా ప్రాంతంలో 15 గంటలకుపైగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో పాక్ ఉగ్రవాది సైతం ఉన్నాడు. ఈ ఆపరేషన్లో ఓ ఆర్మీ జవాన్ అమరుడవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్కౌంటర్ జరిగిన అనంతరం జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. రాజ్పోరాలోని హంజిన్ గ్రామంలో గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఓజీ, ఆర్మీ, 44 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ 182, 183 బెటాలియన్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
అనంతరం కార్డన్ సర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి కాల్పులు జరిపారు. బలగాలు లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినా.. తిరస్కరించి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం కాల్పులు ప్రారంభించాయి. గురువారం రాత్రి నుంచి ఎన్కౌంటర్ శుక్రవారం వరకు సాగగా.. ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీకి చెందిన 44 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన హవల్దార్ కాశీ రావు ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. కాశీరావు కర్ణాటకలోని విజయపుర వాసి. ఎన్కౌంటర్ సమయంలో ఛాతి భాగంలో తీవ్రం గాయం కావడంతో ఆర్మీ చాఫర్లో శ్రీనగర్లోని 92 బేస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు నాలుగు సంవత్సరాల కూరుతు, ఏడాది కొడుకు ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదం అలుముకున్నది. అయితే, దిగువ ముండాలో 2016లో టీవీ టవర్ గార్డ్ నుంచి దోచుకున్న ఎస్ఎల్ఆర్ ఆయుధంతో పాటు రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.