తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 తేదీల మధ్య వరకు వర్చువల్ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు.. బుకింగ్ తేదీ నుంచి సంవత్సరంలోపు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. భక్తులు మార్పును గమనించి, అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో సర్వదర్శనం టికెట్ల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే ఆన్లైన్ ద్వారా జారీ చేస్తోంది.
అయితే, ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మళ్లీ సర్వదర్శనం టికెట్ల కోటా విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వీటిపై టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈఓ జవహర్రెడ్డి స్పష్టత ఇచ్చారు. గతంలో సర్వదర్శనం టికెట్లు జారీ చేసిన సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని, దీంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతానికి వస్తేనే సర్వదర్శనం టికెట్లను విడుదలపై ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ టికెట్ల కోటాను సైతం పెంచేది లేదని స్పష్టం చేశారు.