ముంబై : నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు. అలాగే ఐదు ఏకే-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది. గత సంవత్సర కాలంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలు పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో అధికారులు బిజీగా ఉండగా.. అక్రమార్కులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమంగా రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను హై అలర్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.