న్యూఢిల్లీ: టీమిండియాకు భారీ జలక్ తగిలింది. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Reddy).. ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం వల్ల అతను ఆ టోర్నీకి దూరం అవుతున్నాడు. ఇటీవల ఆఫ్గనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో అతను గాయపడ్డాడు. అయితే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పాత్రను పోషిస్తాడని అనుకున్న నితీశ్ రెడ్డి అనూహ్య రీతిలో ఐర్లాండ్ సిరీస్ను మిస్ కానున్నాడు.
ఎడమకాలి కండరంలో వాపు వచ్చినట్లు ఎంఆర్ఐ స్కానింగ్లో తెలిసిందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. అయితే బెంగుళూరులోని సీఓఈలో కోలుకునేందుకు అతను వెళ్లాడు. నితీశ్ రెడ్డి కోలుకునేందుకు కనీసం నాలుగు వారాలు పడుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఒకవేళ ఆ టైం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా భావించారు.
23 ఏళ్ల నితీశ్ రెడ్డి ఇప్పటి వరకు 10 టెస్టులు, ఆరు వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్తో అతను రెండు వన్డేలు ఆడాడు. లక్నో మ్యాచ్లో అతను ఆడలేదు. గాయం చిన్నదే అని తొలుత భావించారు. కానీ స్కానింగ్లో ఆ నొప్పి తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. నొప్పి వల్ల నితీశ్ పేస్ బౌలింగ్ చేయలేకపోతున్నట్లు గుర్తించారు.