న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా 57,477 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో 24 గంటల్లో 738 మరణాలు నమోదయ్యాయని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,02,362కు పెరిగాయి. 2,96,05,779 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్ ప్రభావంతో 4,01,050 మంది మృత్యువాతపడ్డారు. మరో వైపు దేశంలో యాక్టివ్ కేసులు 95 రోజుల తర్వాత 5లక్షలకు దిగువకు చేరాయి. ప్రస్తుతం 4,95,533 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 34,46,11,291 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.50శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని వివరించింది. ఇప్పటి వరకు 41.64 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.