చండీగఢ్: వృద్ధాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయన పెంచి, చదివించి, ప్రయోజకులను చేసిన ముగ్గురు కుమార్తెలు తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు. పైగా వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను వీక్షించారు. (Man dies in old-age home) హర్యానాలోని సోనిపట్లో ఈ సంఘటన జరిగింది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తా, సుమారు రెండు సంవత్సరాల కిందట తన భార్యతో కలిసి హర్యానాలోని సోనిపట్లో ఉన్న వృద్ధాశ్రమంలో చేరారు. భార్య ముందే చనిపోగా, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 4న తెల్లవారుజామున మరణించారు.
కాగా, శివచరణ్ మరణాంతరం ఆయన ముగ్గురు కుమార్తెలను వృద్ధాశ్రమం యాజమాన్యం సంప్రదించింది. ముంబై, ఉత్తర ప్రదేశ్, నేపాల్లో ఉన్న ఆ ముగ్గురు కుమార్తెలు సోనిపట్కు రాలేమని చెప్పారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని వృద్ధాశ్రమం యాజమాన్యాన్ని కోరారు. అయితే నేపాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పెద్ద కుమార్తె అనిత ఆన్లైన్ ద్వారా వృద్ధాశ్రమం యాజమాన్యానికి రూ. 5,100 పంపింది. తన తండ్రి అంత్యక్రియలను సక్రమంగా నిర్వహించాలని కోరింది. ఈ నేపథ్యంలో స్థానిక సమాజ సభ్యుల సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించగా ఆ ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్ ద్వారా దీనిని వీక్షించారు. ఆ సమయంలో ‘ఇంకెంత సమయం పడుతుంది? మేం స్నానం చేసి భోజనం చేయాలి కదా’ అని ఒక కుమార్తె అనడం వినిపించింది.
మరోవైపు శివచరణ్ తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా తన ముగ్గురు కుమార్తెలతో తరచుగా మాట్లాడేవారని వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ తెలిపారు. అయితే ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత వారి నుంచి ఫోన్ కాల్స్ తగ్గిపోయాయని చెప్పారు. శివచరణ్ మరణానికి 20 రోజుల ముందే ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని కుమార్తెల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన్ని చూడటానికి వారు రాలేదని ఆయన అన్నారు.
కాగా, శివచరణ్ తన ముగ్గురు కుమార్తెలకు ఉన్నత విద్య అందించారని, వారి విజయాల పట్ల ఎంతో గర్వపడేవారని వృద్ధాశ్రమ నిర్వాహకులు గుర్తు చేశారు. ఆయన కుమార్తెలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా స్థిరపడినట్లు చెప్పారు. పెద్ద కుమార్తె అనిత నేపాల్లో, రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్లో నివసిస్తుండగా, చిన్న కుమార్తె ప్రియ ముంబైలో ఉంటోందని అన్నారు. ముగ్గురికీ వివాహాలు జరిగినట్లు వివరించారు.
అయితే తండ్రి అంత్యక్రియల కోసం రాలేమని చెప్పిన ముగ్గురు కుమార్తెలు ఆయన అస్థికలను కూడా గంగా నదిలో నిమజ్జనం చేయాలని తమను కోరినట్లు వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు. శివచరణ్ మరణానంతరం ఆయన కోరిక మేరకు కళ్ళను దానం చేయడానికి ముగ్గురు కుమార్తెలు అంగీకరించినట్లు వెల్లడించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
People often claim daughters always take care of their parents. But every situation is different. This father passed away in an old-age home, and his daughter couldn’t attend his last rites, asking on a video call to hurry up. Heartbreaking. 💔 pic.twitter.com/uzZIOdzog2
— Byomkesh (@byomkesbakshy) August 6, 2026