న్యూఢిల్లీ, ఆగస్టు 8: వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) పౌరులను హెచ్చరించింది. ‘బాస్ స్కామ్’గా పిలిచే ఇటువంటి మోసాలపై నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. సైబర్ నేరగాళ్లు కార్పొరేట్ సంస్థల్లో మేనేజర్లు, ఎండీలు, సీఏలు, ఇతర ఉన్నతాధికారుల పేరిట కింది ఉద్యోగులు, ముఖ్యంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి మెసేజ్లు పంపుతారు. ఫలానా ఖాతాకు ఇన్ని లక్షలు పంపండి అంటూ ఆదేశాలు ఇస్తారు. అది తమ బాస్ ఇచ్చాడని భావించి ఆ ఉద్యోగులు ఆ మొత్తాన్ని ఆ మ్యూల్ ఖాతాలకు జమ చేసి మోసపోతుంటారు.