సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ గ్రేటర్ పరిధిలో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. కీలకమైన డిజిటైజేషన్ నత్తనడకన సాగుతున్నది. బీఎల్ఓలు ఇళ్ల వద్దకు వచ్చి స్వీకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోకపోవడంతో సాధారణ ఓటర్లు, పౌరులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటర్ల నుంచి బీఎల్ఓలు సేకరించిన ఫారాలను డేటా ఎంట్రీ అధికారులు ఆన్లైన్ సిస్టం నమోదు చేయడంలో సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలు పెద్ద అవరోధంగా మారుతున్నాయనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జిల్లాలో బుధవారం వరకు 57.56 శాతం మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియ జరిగింది. మరో ఐదు రోజుల్లో నిర్ధేశిత గడువు మగియనుండటంతో ఓటర్లలో ఆందోళన పెరిగింది. చివరి నిమిషంలో బీఎల్ఓలు ఆబ్సెంట్ అని పెడితే ఓటర్ జాబితాలో తమ పేర్లు గల్లంతు అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్ఓలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లారు. కానీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకుంటారో.. ఎప్పుడు ఆన్లైన్ చేస్తారో స్పష్టత లేదు. గడువు ముగిసిపోతే మా ఓటు హకు గల్లంతవుతుందేమోనని భయంగా ఉంది. అని నగరానికి చెంది న పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. నిర్ధేశిత గడువుకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండటం.. మరోవైపు బోనాల ఉత్సవాలు సర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది
. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది ఓటర్ల వివరాల నమోదు పెండింగ్లో పడే ప్రమాదం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓటర్ల జాబితా పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 9,95,315 మంది ఏఎస్డీ ఓటర్లుగా ( ఏ-లేనివారు, ఎస్-వలస వెళ్లినవారు, డీ-మరణించినవారు) మూడు విభాగాల కింద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని స్పష్టం చేశారు. ఈ జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తామని కర్ణన్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ 88,933, యాకత్పురాలో 84,792, చంద్రాయణగుట్టలో 81,500, సికింద్రాబాద్లో 79,457, కంటోన్మెంట్లో 74,962 మంది ఓటర్లు ఏఎస్డీ కేటగిరిలో ఉండటడం గమనార్హం. సవరించిన ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ నత్తనడకను తలపిస్తోంది.
ఇప్పటివరకు కేవలం57.56 శాతం డిజిటైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఇంత మందకొడిగా సాగడం వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. ఇదే వేగంతో వెళ్తే పెంచిన గడువులోపల డిజిటలైజేషన్ పూర్తి కావడం కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన బీఎల్ఓలకు సాంకేతిక అడ్డంకులు శాపంగా మారాయి. ఓటర్ల వివరాలను నమోదు చేద్దామంటే కమిషన్కు సంబంధించిన అధికారిక యాప్లు, వెబ్సైట్లు మొరాయిస్తున్నాయి. సర్వర్డౌన్ సమస్య తలెత్తుతుండటంతో గంట ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని బీఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటు ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంటే, అటు సాంకేతికత సహకరించక వారు సతమతమవుతున్నారు.
సర్కు సహకరించండి: ఆర్వీ కర్ణన్
సర్ కార్యక్రమానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు తమవంతు భాగస్వామ్యాన్ని అందించాలన్నారు. ప్రతి రాజకీయ పార్టీ తమ బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్ఏ) పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) సంతోష్ కుమార్తో పాటు బీఎస్పీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ (ఐఎన్సీ), బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎం (ఏఐఎంఐఎం), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి) ప్రతినిధులు పాల్గొన్నారు.
సర్ వివరాలు
జిల్లా మొత్తం ఓటర్లు : 47,36,669
ఎన్యుమరేటర్లు ఫారాల పంపిణీ : 100 శాతం
మొత్తం డిజిటైజేషన్ పూర్తయినవి : 27,26,655 (57.56శాతం)
డిజిటైజేషన్ పెండింగ్ : 10,14,699