Viral news : యజమానుల పట్ల పెంపుడు జంతువులు (Pet Animals) ముఖ్యంగా శునకాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయి. తాజాగా ఓ శునకం తన యజమాని కోసం ప్రాణాన్నే త్యాగం చేసింది. ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ భయంకరమైన విష సర్పంతో గంటపాటు పోరాడి, దాన్ని హతమార్చి, చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బలియా (Ballia) లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బలియాలోని ఓ కుటుంబం ‘టామీ’ అనే కుక్కను గత తొమ్మిదేళ్లుగా పెంచుకుంటోంది. అది వారికి కేవలం పెంపుడు జంతువు కాదు, కుటుంబంలో ఓ సభ్యుడు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఓ విషపూరిత పాము వారి ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆ పామును టామీ గమనించింది.
వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి, గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కేవలం అరవడమే కాకుండా ఆ పాము ఇంట్లోకి రాకుండా దాని దారికి అడ్డంగా నిలబడింది. ఆ తర్వాత రెండింటి మధ్య భీకర పోరాటం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దాదాపు గంటపాటు టామీ ఆ పాముతో పోరాడింది. చివరికి పామును చంపి తన యజమానులకు ప్రమాదం లేకుండా చేసింది. అయితే ఈ భీకర పోరాటంలో పాము టామీని పలుమార్లు కాటేసింది.
దాంతో పాము విషం దాని శరీరమంతా పాకింది. పామును చంపిన గంట తర్వాత టామీ నెమ్మదిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తనను తొమ్మిదేళ్లుగా కంటికి రెప్పలా చూసుకున్న కుటుంబం కోసం ప్రాణత్యాగం చేసింది. టామీ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ‘ఆ రాత్రి టామీ గనక ఆ పామును అడ్డుకోకపోతే, అది ఇంట్లోకి వచ్చి మాలో ఎవరికైనా హాని తలపెట్టేది. మా ప్రాణాలను కాపాడటానికి అది తన ప్రాణాలను ఇచ్చింది’ అంటూ అని కుటుంబసభ్యులు విలపించారు.
తమను కాపాడిన ఆ మూగజీవికి కన్నీటితో వీడ్కోలు పలికి, భావోద్వేగాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తెలియడంతో టామీ ధైర్యాన్ని, స్వామిభక్తిని అందరూ కొనియాడుతున్నారు. మాట్లాడలేని మూగజీవాలే కొన్నిసార్లు ప్రేమ, త్యాగం లాంటి గొప్ప పాఠాలు నేర్పుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.