రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 19 (నమస్తే తెలంగాణ): ‘పిల్లలు కష్టపడాలి.. బాగా చదవాలి.. పిల్లల విజయాలు వారికి నచ్చినట్టు ఉండాలని ఆశిస్తున్నా. మీ పాఠశాల తరపున అందరికీ శుభాకాంక్షలు’ అంటూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జడ్పీబాలికల హైస్కూల్లో తెలంగాణలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో టీచర్ మాట్లాడింది. టీచర్ పేరెంట్స్ కమిటీలో సూచనలు ఇస్తూ అబ్బురపరిచింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కింద రూ.10 లక్షలతో బెంగళూరులోని ఇండస్ సంస్థ నుంచి ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబో టీచర్ను జూలై 24, 2026న పాఠశాలకు అందించారు. అదే రోజు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో పాటు సంబంధిత సంస్థ ప్రతినిధులు కలిసి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రోబో టీచర్ పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇండస్ సంస్థ ప్రతినిధులు పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన టీచర్లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించగా రోబో పాల్గొన్నది.
విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు హావభావాలతో సమాధానాలు ఇవ్వడంతో ఎనలేని అనుభూతి పొందినట్టు హెచ్ఎం శారద తెలిపారు. రోబో టీచర్ త్వరలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. హ్యూమనాయిడ్ రోబోను తమ పాఠశాలకు అందించడం గొప్ప విషయమని, విద్యార్థులకు టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతుందని హెచ్ఎం పేర్కొన్నారు. రోబో అద్భుతంగా సమాధానాలు ఇచ్చింద ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సం తోషం వ్యక్తం చేశారు. రోబోను అందించిన కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.