న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన గరిష్ఠ పరిమితి నెలకు రూ.15,000 (బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్-డీఏ కలిపి) నుంచి రూ.25,000కు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు తగ్గట్టుగా ఈపీఎఫ్ సబ్స్ర్కైబర్లకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీం కింద అందే జీవిత బీమా ప్రయోజనాన్ని మాత్రం కేంద్రం పెంచలేదు. దీంతో ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారులు రూ.3.5 లక్షలదాకా బీమా కవరేజీని నష్టపోవాల్సి వస్తున్నది.
ఈపీఎఫ్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ అందే ఉచిత జీవిత బీమా సౌకర్యమే ఈడీఎల్ఐ. సర్వీస్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు/నామినీలకు ఈ బీమా సొమ్ము అందుతుంది. ఈ బీమాకు ఉద్యోగి పనిచేస్తున్న సంస్థనే నెలనెలా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. మొన్నటిదాకా ఇది గరిష్ఠంగా రూ.75 (నెలవారీ బేసిక్ పే, డీఏలో 0.5 శాతం)గా ఉన్నది. ఇప్పుడు రూ.125కు పెరిగింది. ఇటీవల ఈపీఎఫ్ వేతన గరిష్ఠ పరిమితి రూ.15,000 నుంచి రూ.25,000కు పెరుగడమే కారణం. అయినప్పటికీ మోదీ సర్కార్ మాత్రం ఈడీఎల్ఐ కవరేజీ పెంపు ఊసే ఎత్తడం లేదు.
ప్రస్తుతం ఈడీఎల్ఐ ప్లాన్ కింద ఉద్యోగికి కనీస ఇన్సూరెన్స్ కవరేజీ రూ.2.5 లక్షలుగా, గరిష్ఠ బీమా రూ.7 లక్షలుగా ఉన్నది. ఉద్యోగి జీతం, ఈపీఎఫ్ బ్యాలెన్స్లపై ఇది ఆధారపడి ఉంటుంది. నిజానికి 2014కు ముందు ఈపీఎఫ్ వేతన గరిష్ఠ పరిమితి నెలకు రూ.6,500గానే ఉండేది. అప్పుడు ఈడీఎల్ఐ స్కీం ద్వారా బీమా ప్రయోజనం కూడా రూ.1.55 లక్షలే. 2014 సెప్టెంబర్లో వేతన గరిష్ఠ పరిమితి రూ.15,000కు పెరిగింది. అప్పుడే బీమాను కూడా రూ.6 లక్షలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పెంచింది.
ఇక 2021 ఏప్రిల్లో బీమాను మాత్రమే సెపరేట్ నోటిఫికేషన్ ద్వారా రూ.7 లక్షలకు పెంచారు. అయితే ఇప్పటికీ అది అలాగే ఉన్నది. దీంతో ఇప్పుడు వేతన గరిష్ఠ పరిమితి రూ.10,000 పెరిగినందున, ఆ మేరకు బీమా ప్రయోజనాన్నీ పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ పెంచితే గరిష్ఠ బీమా రూ.10.50 లక్షలకు చేరే వీలున్నది. లేకపోతే రూ.7 లక్షలకే పరిమితమై.. ఉద్యోగుల కుటుంబాలు రూ.3.50 లక్షలు కోల్పోవాల్సి వస్తుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల సంక్షేమం గురించేనని, ఇందులో ప్రయోజనాలు శ్రామికుల పొదుపునకు దోహదం చేస్తాయని పలువురు ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈడీఎల్ఐ బీమా కవరేజీని కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వారు సూచిస్తున్నారు. ఉద్యోగి మరణం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందే ఈ పరిహారం విషయంలో మోదీ సర్కార్ లెక్కలు వేయడం సరికాదని, వెంటనే ఈపీఎఫ్ వేతన గరిష్ఠ పరిమితికి తగ్గట్టుగా ఈడీఎల్ఐ బీమా ప్రయోజనాన్నీ పెంచేలా ఓ నోటిఫికేషన్ విడుదల చేయాలని అంటున్నారు.
నోట్: బీమా ప్రయోజనం అందే సమయంలో ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ సగటు తక్కువగా ఉంటే అందులో 50 శాతాన్నే పరిగణనలోకి తీసుకుని చెల్లింపులుంటాయి. ఇల్లు, చదువు, ఆరోగ్య సమస్యలు తదితర అవసరాల నిమిత్తం చాలామంది తమ పీఎఫ్ సొమ్ము నుంచి పాక్షిక ఉపసంహరణలు చేసుకుంటున్నది చూస్తూనే ఉన్నాం. అలాగే బేసిక్ పే, డీఏ (డీఏ లేకపోతే బేసిక్ పే ఆధారంగానే) ఉద్యోగులందరికీ ఒకేలా ఉండవు. కనుక బీమా ప్రయోజనం కనిష్ఠంగా రూ.2.5 లక్షలు, గరిష్ఠంగా రూ.7 లక్షల మధ్య ఎంతైనా రావచ్చు.