బెంగళూరు, సెప్టెంబర్ 19: ‘పౌరులపై ఎన్నిరకాల పన్నులు వేసి పీడించవచ్చు?’ అనే అంశంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రీసెర్చి చేస్తున్నట్టు కన్పిస్తున్నది. ఐదు నగర కార్పొరేషన్లతో ఉన్న గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ)ఇళ్ల యజమానుల నుంచి కొత్తరకం పన్నును వసూలు చేయడం ప్రారంభించింది. వారు ఇక నుంచి ఆస్తిపన్నుతో పాటు రూ.200 ‘సాఫ్ట్వేర్ చార్జీ’ కూడా చెల్లించాలి.
దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రజలపై నిశ్శబ్దంగా విధిస్తుండటం పట్ల జీబీఏపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాణిజ్య భవనాలపై ఈ చార్జీ రూ.1000 ఉండచ్చునని సమాచారం. కాగా, జీబీఏ చర్యను విపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది పట్టపగలు దోపిడీ అని వ్యాఖ్యానించాయి.