గుణ, సెప్టెంబర్ 19: మధ్యప్రదేశ్లోని గుణ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన సెగ తగలింది. నియోజకవర్గంలోని ఒక గ్రామానికి వెళ్తున్న ఆయన కాన్వాయ్ను ఆపిన స్థానికులు చిరకాలంగా పెండింగ్లో ఉన్న రోడ్డును వెంటనే వేయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు వేయకపోతే ఓటు వేయమంటూ ఈ సందర్భంగా ఆయనను హెచ్చరించారు. అయితే ప్రజలు తనను హెచ్చరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్చరికకు బదులుగా అభ్యర్థన చేయాలని, ఆ పనిని పూర్తి చేసే బాధ్యతను తనకు వదిలేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ను చుట్టుముట్టిన ప్రజలు చేతుల్ల్లో ప్లకార్డులు ధరించి ‘రోడ్డు వేయకపోతే ఓటు వేయం’ అంటూ నినాదాలు చేశారు. ‘ఈసారి మీరు ఈ రోడ్డు వేయాల్సిందే. లేకపోతే ఎన్నికల సమయంలో వచ్చి ఓటు అడిగితే మేం వేయబోం’ అని కాలనీవాసులు మంత్రికి తెగేసి చెప్పారు. ఇది జరిగిన అరగంట తర్వాత ఒక బహిరంగ సభలో రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.