వెండితెర ప్రేక్షకుల్ని అలరించే హీరో హీరోయిన్లు కొంతకాలం పాటు సినిమాల్లో కనిపించకపోతే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. తాజాగా అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇలాంటి రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అను ఈమధ్య సినిమాల్లో కనిపించకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైపోయిందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ తాను ఇండస్ట్రీలోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది అను.
‘అసలు నేను నటనకు దూరమయ్యానని ఎవరు చెప్పారు? అలా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను ఎవరు మొదలుపెడతారో అర్థం కావడం లేదు. సినిమా పరిశ్రమను వదిలేసి వెళ్లే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే రొటీన్ పాత్రలు కాకుండా నటనకు ఆసారమున్న మంచి కథల కోసమే చూస్తున్నాను. త్వరలోనే నా కొత్త సినిమాల వివరాలను స్వయంగా ప్రకటిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
కాగా, మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి చిత్రంలోనే తన చలాకీ నటన, అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’లో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య..’ వంటి భారీ ప్రాజెక్టుల్లో కనిపించే లకీ చాన్స్ కొట్టేసింది.