మాదాపూర్, సెప్టెంబర్ 19: మాదాపూర్ గుట్టలబేగంపేట్లోని సియేట్ మారుతీ హిల్స్ కాలనీకి చెందిన సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను అక్రమంగా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. గుట్టలబేగంపేట్లోని సున్నం చెరువు సమీపంలోని సర్వే నంబర్లు 12, 12ఏ, 13లలో తమకు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు బాధితులు తెలిపారు.
19వ తేదీన ఉదయం 8.15 గంటల సమయంలో ప్రకాశ్, ధారక్, ప్రేమలత, కల్యాణ్తో పాటు పలువురు వ్యక్తులు సున్నం చెరువు పరిసర ప్రాంతంలోని తమ ఓపెన్ ప్లాట్లలోకి అక్రమంగా చొరబడి చుట్టూ బ్లూ షీట్లు ఏర్పాటు చేస్తూ కబ్జాకు యత్నించారని ఆరోపించారు. స్థలాల్లోకి తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గతంలో కూడా ఇలాగే కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని మళ్లీ వచ్చారని బాధితులు తెలిపారు.
ఈ భూములకు చెందిన హక్కులు, పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కబ్జా చేస్తున్న సమయంలో నిర్మాత సీ కల్యాణ్ తన అనుచరులతో కలిసి ప్లాట్లలోకి వచ్చి తమను దగ్గరకు రానివ్వకుండా అనుచరులతో కలిసి అడ్డుకున్నట్లు తెలిపారు. బాధితులు శ్యామ్ సింగ్, సదానందం, సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.