(AP Employees) విజయవాడ : న్యాయబద్దమైన డిమాండ్ల సాధనకు నడుం బిగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. ఇవాళ రెండో రోజు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ముందుంచిన 71 డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతుందని ఏపీ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు.
పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏపీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. 2018 లో రావాల్సిన పీఆర్సీని ఇప్పటికీ అమలు చేయడం లేదని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. తమ ఆందోళనలు జనవరి 6 వరకు కొనసాగుతాయని జేఎసీ నాయకులు తెలిపారు.
కాగా, విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ హాలులో ఎన్జీవోలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అన్ని జిల్లాల నుంచి 70 ఎన్జీవో సంస్థల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగుల ఆందోళనకు టిడ్కో, మెప్మా, ఖాదీ శాఖలు మద్దతు తెలిపాయి. కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..