ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఐదేళ్లుగా ఆలయానికి అందిన నగదు విరాళాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. (Siddhivinayak Donations) ఈ ఆడిట్ నిర్వహించి, సవివరమైన నివేదికను సిద్ధం చేసేందుకు అదనపు ప్రధాన కార్యదర్శి అసిమ్ గుప్తాను ఆయన నియమించారు. ప్రత్యేక ఆడిట్లో ఏవైనా అవకతవకలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా పరిగణించే సిద్ధివినాయక ఆలయం విరాళాలు చోరీ అవుతున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఉద్యోగుల చేతివాటం వల్ల ప్రతి ఏటా రూ.18 కోట్ల విరాళాలు దొంగతనానికి గురవుతున్నాయని పార్టీ కార్యక్రమంలో తెలిపారు. అయోధ్యలోని రామ మందిరం నుంచి రూ. 1,400 కోట్లు అదృశ్యమయ్యాయని, సిద్ధివినాయక ఆలయం కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నదని రాజ్ ఠాక్రే విమర్శించారు. ఎనిమిది మంది ట్రస్టీలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు.
మరోవైపు సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ చైర్మన్, శివసేన షిండే వర్గం నేత సదా సర్వంకర్ కూడా ఈ ఆరోపణలను ధృవీకరించారు. అక్రమాల గురించి తాను స్వయంగా ఏసీబీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన ట్రస్ట్ అధికారులను తొలగించినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు రాజన్ పెందుల్కర్, ఆయన తొమ్మిది మంది సహచరులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కేసులో 45 మందిపై చర్యలు తీసుకున్నామని, వారందరినీ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను మంగళవారం కలిసి విరాళాల చోరీ ఆరోపణలపై చర్చించారు.