Supreme Court : ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గత జూలైలో సీజేపీ ఆందోళన సందర్భంగా హింస తలెత్తిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, ఉద్యమకారులపై భద్రతా దళాలు పెల్లెట్ గన్స్ వాడకం, అదనపు బలగాల్ని ప్రయోగించడం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీజేపీ ఆందోళనలో హింస అంశంపై విచారణ జరుపుతున్న ఉన్నతస్థాయి విచారణ కమిటీ (హెచ్పీఈసీ)కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పెల్లెట్ గన్స్ వాడకం, మహిళా ఉద్యమకారులపై వేధింపులు, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులతోపాటు పోలీసులపై జరిగిన దాడులపై కూడా విచారణ జరపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ తాజాగా ఈ అంశంపై విచారణ జరుపుతోంది. సుప్రీంకోర్టు గతంలో ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుల కూర్పుపై పలు పిటిషన్లు దాఖలుకాగా.. వాటిపై విచారణ జరుగుతోంది. ఈ కమిటీలోని సభ్యల్ని మార్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కమిటీ ఇంకా విచారణను పూర్తిస్థాయిలో ప్రారంభించలేదని, అలాంటప్పుడు పక్షపాతంతో పని చేస్తుందని ఎలా ఆరోపిస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేయాలని దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కమిటీ ఇంకా పనిచేయడం కూడా ప్రారంభించలేదని కూడా తెలిపింది. ఉన్నతస్థాయి కమిటీ విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుందని, నిష్పక్షపాత, పారదర్శకతతో కూడిన విచారణ జరుగుతుందని కోర్టు హామీ ఇచ్చింది. ఈ కమిటీ ఏ ఒక్కవైపో పనిచేయబోదని తెలిపింది.
ఈ విచారణను పర్యవేక్షించడానికి ఇద్దరు లాయర్లతో కూడిన అమికి క్యూరీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ ఉద్యమంలో పాల్గొన్న 14 ఏళ్ల బాలిక కుటుంబానికి వేధింపులు వస్తుండటంపై కోర్టు స్పందించింది. బాధిత బాలిక దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.