Nitin Gadkari : ఈ20 పెట్రోల్ (E20 Petrol) విషయంలో కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin gadkari) ని లక్ష్యంగా చేసుకుని పలువురు నెటిజన్లు ఆన్లైన్లో డీప్ఫేక్ వీడియోలు (Deep Fake Videos), పోస్టులు పెట్టడంపై బాంబే హైకోర్టు (Bombay High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రమంత్రిని, ఆయన కుటుంబాన్ని ఇంధన వివాదంతో ముడిపెడుతున్న ఏఐ వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని మెటా, గూగుల్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల (Social Media Plotforms) ను ఆదేశించింది.
అది అత్యంత నీచమైన కంటెంట్ అని హైకోర్టు మండిపడింది. ఆన్లైన్లో ఇలాంటి పోస్టులకు చోటు ఉండకూడదని అభిప్రాయపడింది. బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించకుండానే ఇలాంటి నకిలీ పోస్టులను తొలగించడానికి ఏదైనా యంత్రాంగం ఉందా..? అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకునే యంత్రాంగం మాత్రం ఎందుకు లేదని కోర్టు నిలదీసింది.
వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా ఉండే పోస్టులను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించింది. ఈ20 (E20) పెట్రోల్తో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గడ్కరీ ఇటీవల తెలిపారు. దీనిపై ఆన్లైన్లో డీప్ఫేక్ వీడియోలు పెడుతున్నారని పేర్కొంటూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తన పరువుకు భంగం కలిగించినందుకుగానూ రూ.11 కోట్ల నష్టపరిహారం కోరారు. ఇథనాల్-బ్లెండింగ్ కార్యక్రమం పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇందులో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని గడ్కరీ స్పష్టంచేశారు.