చుంచుపల్లి, ఆగస్టు 05 : చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లోకి భారీగా నీరు చేరినప్పటికీ, తూముల షట్టర్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడంతో నీరు నిరంతరం బయటకు వెళ్లిపోతోందని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి సాగు అవసరాలకు వినియోగించాల్సిన కీలక సమయంలో ఇలా వృథాగా పోవడం వల్ల భవిష్యత్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను పలుమార్లు ఇరిగేషన్ అధికారులు, సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చెరువుల పరిస్థితి ఇంత దారుణంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు రైతులే స్వచ్ఛందంగా రాళ్లు, ఇసుక బస్తాలతో తాత్కాలికంగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా విఫలమైందని తెలిపారు.
గతంలో కూడా షట్టర్ల మరమ్మతుల కోసం సింగరేణి పీవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. కృష్ణారాయుడు చెరువుకు మాత్రం రైతులే తమ సొంత ఖర్చులతో షట్టర్లను మరమ్మతులు చేయించుకోవాల్సి రావడం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు. పెద్ద చెరువు, ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల తూముల షట్టర్లను వెంటనే మరమ్మతులు చేయకపోతే వర్షపు నీరు పూర్తిగా వృథా అయ్యే పరిస్థితి నెలకొంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖతో పాటు సింగరేణి అధికారులు కేవలం హామీలకే పరిమితం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

సింగరేణి ,ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో వృథాగా పోతున్న చెరువు నీరు