న్యూఢిల్లీ : యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ భారత్లో శుక్రవారం విక్రయానికి వచ్చింది. కొత్త ఫోను కొనుగోలు చేసేందుకు ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టోర్లు తెరవకముందే క్యూలో నిల్చోవడం, ఇతర రాష్ర్టాల నుంచి రావడం, ఏకంగా బంగారం విక్రయించి, ఫోన్ కొనుగోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద ఉదయం 8 గంటలకు దుకాణం తెరవక ముందే క్యూలు ఏర్పడ్డాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేసేందుకు వచ్చాడు. ఈ ఫోను కొనుగోలు కోసం బంగారం అమ్మినట్లు వెల్లడించాడు.
అదేస్టోర్కు పంజాబ్ నుంచి గుర్దితా సింగ్ అనే వ్యక్తి స్నేహితుడితో కలసి వచ్చాడు. త్వరలో వివాహం కానుండటంతో తన కాబోయే భార్యకు బహుమతిగా ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేశాడు. తన కోసం కూడా మరో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ తీసుకున్నాడు. రెండు ఫోన్ల కోసం రూ.3.5లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చించాడు. వీరిద్దరూ ఉదయం 6 గంటల నుంచే స్టోర్ వద్ద ఉన్నారు. ఐఫోన్ ప్రో 265జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, అదే స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.1,79,900 నుంచి మొదలవుతున్నది. స్టోరేజ్ ఆప్షన్లను అనుసరించి ధరలు పెరుగుతాయి.