హైదరాబాద్, ఆట ప్రతినిధి/ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 18: నేషనల్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. పుదుచ్చెరిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఉదయ్ కిరణ్, కె. స్వప్న, సాయి ఆదిత్య స్వర్ణ పతకాలతో మెరిశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం పర్వతాపూర్కు చెందిన ఉదయ్కిరణ్ లాంగ్జంప్ ఈవెంట్లో 6.86 మీటర్ల దూరం జంప్ చేసి బంగారు పతకం సాధించాడు.
హైదరాబాద్ సాయ్-ఎస్టీసీలో శిక్షణ పొందుతున్న అథ్లెట్లలో సాయి ఆదిత్య 600 మీటర్ల (1 నిమిషం 24 సె), మిడ్లె రిలేలో స్వర్ణాలు సొంతం చేసుకోగా.. కె. స్వప్న 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో 11 నిమిషాల 25.39 సెకండ్లతో మీట్ రికార్డు బ్రేక్ చేస్తూ గోల్డ్ నెగ్గింది. ఆనంది మిడ్లె రిలేలో కాంస్యం నెగ్గి టోర్నీలో మూడో పతకం ఖాతాలో వేసుకోగా.. సుశాంత్ రెడ్డి (3000 స్టీపుల్ఛేజ్), మనోజ్ (5000 మీ.) కాంస్య పతకాలు సాధించారు.