ముంబై : మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నా కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. నిత్యం పెద్ద ఎత్తున కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం లేదంటే రాత్రి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సీఎం ఉద్ధవ్ ఠాకే ప్రకటన చేసే అవకాశం ఉన్నది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని మంత్రులు కోరారు.
సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించాలని సీఎంను అభ్యర్థించామని, ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, సీఎం తుది నిర్ణయం ప్రకటిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే మంగళవారం పేర్కొన్నారు. కొవిడ్ కేసులను ఆపేందుకు, అవసరమైన మందులు కొనుగోలు చేసేందుకు 15 రోజుల పూర్తి లాక్డౌన్ అవసరమని ఎన్సీపీ మంత్రి చాగన్ భుజ్బాల్ అన్నారు.
మందులు, పరికరాల కోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం, అత్యవసర అవసరాలకు మాత్రమే ప్రజారవాణాకు అనుమతింవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ చాలా మంది వీధుల్లో తిరుగుతున్నారని, ఈ మేరకు కఠిన లాక్డౌన్ అవసరమని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. ఆక్సిజన్, పడకల కొరత ఉందని, వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని షిండే తెలిపారు.