తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండో రోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు.
మొదటి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు కల్యాణం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.