న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రోజుకు రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు భారత్కు రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్ భారత్ రెడ్లిస్ట్లో చేర్చింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు బ్రిటన్కు నడిచే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విషయాన్ని గమనించాలని సూచించింది. విమానాల రీషెడ్యూల్ తేదీలు, రీఫండ్కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుపుతామని విమానయాన సంస్థ ప్రకటించింది.
రెండు రోజుల కిందట భారత్ నుంచి అన్ని రకాల ప్రయాణాలను బ్రిటన్ నిషేధించింది. బ్రిటన్, ఐరిష్ దేశాల పౌరులు తప్పనిసరిగా పది రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్లో సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే భారత్–హాంకాంగ్ మధ్య విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇటీవల హాంకాంగ్ విమానయాన శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ మే 2 వరకు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యూజిలాండ్ సైతం భారత విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక సూచనలు చేసిన విషయం విదితమే. భారత్లో అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు సైతం కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపింది.