లక్నో : మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు దాటినవారికి ఉచితంగానే వ్యాక్సిన్ అందుతుందని, 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయరని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా వేస్తామని చెప్పారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం.. ఈ విషయాన్ని ప్రకటించారు.
‘మంత్రివర్గ సమావేశంలో ఉత్తరప్రదేశ్లో 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని నిర్ణయించాం. కరోనా వైరస్ ఓడిపోతుంది.. భారతదేశం గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. అలాగే క్యాబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం సైతం తీసుకున్నారు. వైరస్ కట్టడికి వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉండనుంది. అత్యవసరమైన సేవలు మినహాయింపునిచ్చారు. అలాగే అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ సైతం 18-45 సంవత్సరాల మధ్య వస్సున్న వారికి ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ట్వీట్ చేశారు.