Lord Rama | అయోధ్యా రాముడు.. తెలంగాణ రాముడు కూడా! శ్రీరాముడి జన్మభూమి ఇంకెక్కడో ఉండవచ్చు. కర్మభూమి మాత్రం తెలంగాణ గడ్డే! కారణం, ఇక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి అడవులలో సంచరించాడు. ఇక్కడి కందమూలాలు తిన్నాడు. ఇక్కడి తోటల్లో సీతాసమేతుడై విహరించాడు. ఇక్కడి జలాశయాల్లో స్నానం చేశాడు. ఈ నేల సాక్షిగా సంధ్యాది విధులలో ‘గోదావరి తీరే..’ అని సంకల్పం చెప్పుకొన్నాడు. అందుకే, తెలంగాణ ప్రజలు శ్రీరాముడిని తమ వాడిని చేసుకున్నారు. ‘రామన్నా..’ అని ఆత్మీయంగా పిలుచుకున్నారు. ఊరికో గుడి కట్టుకున్నారు. ప్రతి గుండెలో ప్రతిష్ఠించుకున్నారు. జనకుడికంటే ఘనంగా సీతారామ కల్యాణం జరిపిస్తారు. ఆదికావ్యంలో లేని కథలూ, మూల రామాయణం ప్రస్తావించని ఘట్టాలూ తెలంగాణ స్థలపురాణాల్లో అనేకం!
రామో విగ్రహవాన్ ధర్మః
సాధుః సత్యపరాక్రమః
శ్రీరాముడు నిలువెత్తు ధర్మ స్వరూపం. వాక్పాలన ధర్మవంతుల సహజ లక్షణం. కాబట్టే, భద్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. భద్రగిరిమీద వెలిశాడు. ‘భద్రాచల రాముడ’న్న పేరు తెచ్చుకున్నాడు. గుడి కట్టిన గోపన్నకు గుండెల్లో స్థానమిచ్చాడు. ఆ ప్రేమతోనే గోల్కొండ సుల్తానుకు రామటెంకలిచ్చి రామదాసును విడిపించాడు. ముక్తినిచ్చి భవబంధాల నుంచీ విముక్తుడిని చేశాడు. రామన్న పెండ్లంటే మన ఇంటి పెండ్లే! కాబట్టే, సర్కారువారు ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్తే, సామాన్యులు శక్తిమేర గోటి తలంబ్రాలు సమర్పించుకుంటారు. పానకాలతో నోరు తీపి చేసుకుంటారు.
‘ఛాయేవానుగతా సదా..’
‘సీత నా నీడలాంటిది’ – అని ప్రకటించాడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ అంటే అంత ప్రేమ! కాబట్టే, ఇల్లాలు మాయలేడి మీద మనసు పడగానే, మారు మాట్లాడకుండా ధనుర్బాణాలతో వేటకు వెళ్లాడు. వీరాచలం (నేటి జీడికల్) దగ్గర మాయావి మారీచుడిని సంహరించాడు. అంతలోనే, సంధ్యా వందనానికి సమయమైంది. కానీ, పరిసరాల్లో జలాశయాలు కనిపించలేదు. తన బొటన వేలితో ఓ బండను నొక్కగా గంగ పొంగుకొచ్చిది. ఆ నీటితోనే సూర్యుడికి అర్ఘ్యమిచ్చాడు. అక్కడే, కఠోర ధ్యానముద్రలో ఉన్న వీరుడు కనిపించాడు. ఆ భక్తుడిని కటాక్షించి ముందుకు కదిలాడు రామసార్వభౌముడు. అదే నేటి ‘వీరాచల క్షేత్రమని’ భక్తుల విశ్వాసం. ఏటా శ్రీరామనవమితోపాటు కార్తీకమాసంలో పునర్వసు నక్షత్రంలో ఇక్కడ సీతారామ కల్యాణోత్సవం జరుపడం విశేషం.
శివుడు నిత్యం రామనామాన్ని స్మరిస్తుంటాడు.
రాముడు పరమ శివభక్తుడు.
శివరాముల మధ్య అభేద్యాన్ని చాటే క్షేత్రం ఒకటి మన తెలంగాణలో ఉంది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి 6 కి.మీ. దూరంలో ప్రకృతి అందాలకు, శిల్ప సంపదకు, ప్రాచీన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రామగిరి. ఈ రామగిరి ఖిల్లా ప్రాంతంలో వనవాస సమయంలో సీతారామలక్ష్మణులు సంచరించినట్లూ, శ్రీరాముడు ఓ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లూ స్థలపురాణం. క్రీ.శ. 5వ శతాబ్దంలో మహాకవి కాళిదాసు తన ‘మేఘ సందేశం’ కావ్యంలో ‘సీతాస్నాన పుణ్యోదకేషు రామగిరి’ అని రాశారు. కాళిదాసు పేర్కొన్న రామగిరి ఇదేనని స్థానికుల విశ్వాసం. రావణ వధ తర్వాత, బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి నేటి కీసరగుట్టలోనూ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రాముడు. హనుమ కాశీనుంచి తెచ్చిన నూటొక్క శివలింగాలనూ అక్కడ భక్తులు దర్శించుకొనేలా ఆనతిచ్చాడు.
సీతమ్మకు తెలంగాణ మట్టిమీద ప్రత్యేకమైన ప్రేమ. సీతను ‘కనకవర్ణాంగి’ అంటాడు వాల్మీకి. ఆమె వన్నె బంగారం. మనసు బంగారం. కాబట్టే, బంగారువర్ణంలో మెరిసిపోతున్న జింకను చూసి మనసు పడింది. మహాకవి సీతను ‘ధర్మజ్ఞా, ధర్మచారిణీ, ధర్మపరా, ధర్మనిరతా’ అని కొనియాడాడు. అంతటి విజ్ఞత, ఆ ఒక్క క్షణం మటుమాయమైంది. రాముడిని జింకకోసం పంపింది. లక్ష్మణుడిని అన్న యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పురమాయించింది. అసురుడి చేతికి చిక్కింది. రామరావణ యుద్ధానికి మూలమైన ఈ కీలకఘట్టం భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 32 కి.మీ. దూరంలోని పర్ణశాల సాక్షిగానే జరిగింది. సాధ్వి స్నానం చేసిన సీతమ్మ వాగూ, ఆ ముత్తయిదువ పసుపుకుంకాలు నూరుకున్న రంగులగుట్టలూ ఆ పరిసరాల్లోనే ఉన్నాయి.
తెలంగాణ రామభక్తుల నిజ నివాసం! ‘పలికెడిది భాగవతమట.. పలికించు విభుండు రామభద్రుండట’ అంటూ భాగవత రచనకు శ్రీకారం చుట్టిన పోతన్న మొదలు, సర్కారు ఖజానాలోని సకల సంపదలూ స్వామిసేవకే ధారపోసి రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న వరకూ ఎంతోమంది పరమభక్తులు! అందులో ఓ అజ్ఞాత భక్తుడు ఆగ్గంపల్లి నచ్చయ్య! సీతారాముల శిల్పం చెక్కి తన జన్మను చరితార్థం చేసుకున్న అదృష్టవంతుడు ఆయన! సిద్దిపేటజిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలోని రాముని గుట్టమీద బండలమధ్య చిన్న గుహలో ఉల్బణ శిల్పాలున్నాయి. సీతాసమేతంగా కొలువైన రాముడితోపాటు అంజలి ముద్రతో హనుమాన్, ధనుర్ధారి లక్ష్మణుడు దర్శనమిస్తారు. సీతారాముల శిల్పం కింద ‘ఆగ్గంపల్లి నచ్చయ్య’ అనే పేరుతో ఒక లఘుశాసనం ఉంది. ఇతడే ఈ శిల్పాలను చెక్కించి దేవాలయాన్ని నిర్మించి ఉంటాడు.
రాముడు నడిచిన దారులు, జానకి స్నానమాడిన కుంటలూ తెలంగాణలో అనేకం. హైదరాబాద్కు అతిచేరువలో సీతారామచంద్రస్వామి కొలువుదీరిన అమ్మపల్లి క్షేత్రం రాష్ట్రంలోనే అతిపురాతన రామాలయమని చెబుతారు. ఇక్కడ రాముడు ఏకశిలామూర్తి.
‘అరణ్యవాసంలో శ్రీరాముడు భద్రాచలం నుంచి జీడికల్లు, ఆలేరు మీదుగా అమ్మపల్లికి వచ్చాడనీ, ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఒంటిమిట్టకు బయల్దేరాడనీ’ అంటారు. ఏటా శ్రీరామనవమికి ఉత్సవమూర్తులను నర్కూడ గామం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న పురాతన మండపంలో ఘనంగా కల్యాణం జరుపుతారు. ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్నికూడా శ్రీరామచందుడు దర్శించుకున్నాడని చెబుతారు. అప్పుడే, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనీ అంటారు. రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడి శివుడుకి ‘రామలింగేశ్వరుడి’గా పేరు.
‘కళ్యానాభిజనః’ – ఉత్తమోత్తమమైన బంధువర్గాన్ని కలిగినవాడు రాముడు. సుప్రజారాముడు బంధాలకు విలువనిచ్చాడు. తండ్రిని గౌరవించాడు. తల్లిని ప్రేమించాడు. తోబుట్టువులను అభిమానించాడు. అనుచరులను అక్కున చేర్చుకున్నాడు. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నంతగా, ఎవరూ తెలుసుకోలేక పోయారేమో! కాబట్టే, హైదరాబాద్ నగరానికి సుమారు 48 కి.మీ. దూరంలోని గుమ్మడిదలలోని రామాలయంలో సీతాసమేతుడైన శ్రీరాముడితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు- మాండవి, శత్రుఘ్నుడు- శృతకీర్తి దంపతుల విగ్రహాలుకూడా దర్శనమిస్తాయి. ఇక్కడి స్వామిని ‘కల్యాణ రాముడ’ని అంటారు. శివధనుర్భంగ సమయానికి నూనూగు మీసాలవాడు రాముడు. అందుకేనేమో, మీసాలతో కనిపిస్తాడు. అప్పటికింకా హనుమ తారస పడలేదు కాబట్టి, హనుమంతుడి మూర్తి కనిపించదు. కిష్కింధాకాండ నాలుగో సర్గలో మారుతిని ప్రవేశ పెడతాడు వాల్మీకి.
వాల్మీకి మహర్షి అనేక సందర్భాల్లో శ్రీరాముడిని ‘శుచి’ అని అభివర్ణించాడు. అంతర్శుచి, బాహ్యశుచి.. రెంటికి సమప్రాధాన్యమిచ్చాడు రాముడు. మనసును శుభ్రం చేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అవసరం. శరీరాన్ని శుచిగా ఉంచుకోవడానికి నీరు కావాలి. శ్రీరాముడికి జలవనరులతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్షాకు వంశస్థులే గంగను నేలకు తెచ్చారు. అరణ్యవాసంలో సీతారాములు నదీమతల్లులకు నమస్కరిస్తూ ముందుకెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు ఘనంగా పూజలు చేస్తానని సీతమ్మ మొక్కుకుంది కూడా. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 30 కి.మీ. దూరంలోని రామగుండం పట్టణానికి ఆ పేరు రావడం వెనుక కూడా ఓ జలకథ ఉంది. రాముడు సీత, లక్ష్మణుడితో కలిసి గోదావరి తీరం వెంట పయనిస్తూ అలసిసొలసి ఓ గుట్టదగ్గర సేదదీరాడు. ఆ ప్రాంతం సీతారాములకు బాగా నచ్చింది. అక్కడే 108 రోజులు విడిది చేశారు. నీటికోసం రోజుకో గుంత తవ్వారు. అవే నేటి 108 గుండాలని స్థానికుల కథనం. జీడిగుండం, పాలగుండం, నేతి గుండం, అమృత గుండం, మోక్షగుండం, కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం, యమగుండం.. ఇలా అన్నిటినీ కలిపి ‘రాముడి గుండాలని’ పిలుస్తున్నారు.
‘ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః’.‘లోకంలో లక్ష్మణుడొక్కడేసత్పురుషుడు’ అని అయోధ్యా ప్రజలు భావించేవారట. ‘లక్ష్మణ శుభ లక్షణమ్’ – సులక్షణ సంపన్నుడు లక్ష్మణస్వామి. విశ్వామిత్ర యాగ సంరక్షణనుంచి రామరావణ యుద్ధం వరకూ ప్రతీ మలుపులో లక్ష్మణుడు రాముడి వెనకాలే ఉన్నాడు. కానీ, నిజామాబాద్జిల్లా ఇందల్వాయి గ్రామంలోని ఆలయంలో లక్ష్మణుడు లేని సీతారాములను చూస్తాం. ఒక్క సందర్భంలో మాత్రమే రాముడు తన సోదరుడైన లక్ష్మణుడి వియోగాన్ని భరిస్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడు. హనుమ తెచ్చిన ఓషధి అతడిని స్వస్థుడిని చేస్తుంది. ఆ ఆనందంలో రాముడు ‘లక్ష్మణా! నా అదృష్టం కొద్దీ నువ్వు బతికావు. నువ్వే లేకపోతే, రాజ్యంతో కానీ, సీతతో కానీ, విజయంతో కానీ ఏమి ప్రయోజనం’ అంటూ అక్కున చేర్చుకున్నాడు. ‘రాముడు భగభగమండే అగ్నిలోకి ప్రవేశిస్తున్నట్టయితే, నేను అంతకు ముందే అందులో ప్రవేశించానని తెలుసుకో తల్లీ!’ అంటాడు లక్ష్మణుడు కౌసల్యతో. రాముడు కూడా ‘లక్ష్మణుడు నా బహిః ప్రాణం’ అని ప్రకటించాడో సందర్భంలో. మరి, ఇక్కడ మాత్రం అన్నదమ్ముల మధ్య ఎడబాటు ఎందుకో? అన్నలోనే తమ్ముడున్నాడన్న భావనతో శిల్పి, ప్రత్యేకించి లక్ష్మణమూర్తిని విస్మరించి ఉండవచ్చు.
గగనం గగనాకారం సాగరః సాగరోపమః
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ‘.. ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరానికి సాగరమే సాటి!’
శ్రీమద్రామాయణ కావ్యం, శ్రీమద్రామాయణం యథా.. రామాయణానికి రామాయణమే సాటి! ప్రపంచ సాహిత్యమంతా ఒక ఎత్తు, రామాయణం ఒక్కటీ మరో ఎత్తు! జనగామజిల్లా పాలకుర్తి సమీపంలోని వల్మీడి గ్రామం ‘వాల్మీకి జన్మస్థల’మని అంటారు. ప్రస్తుతం సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉన్న ప్రాంతమే, ‘వాల్మీకి ఆశ్రమ’మని చెబుతారు. ఆ ప్రకారంగా, సీతమ్మ తల్లి లవకుశులకు జన్మనిచ్చిన చోటూ ఇదే. వల్మీడి అసలు పేరు వాల్మీకిపురం. సమీపంలో వాల్మీకి తపస్సు ఆచరించిన ప్రాంతాన్ని ‘మునుల గుట్ట’ అని పిలుస్తారు. వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథకర్తే కాదు, అందులో ఓ ప్రధాన పాత్రకూడా. ‘పాణావామలకం యథా..’ రామచరిత్రలోని ప్రతి ఘట్టం అరచేతిలోని ఉసిరికాయలా వాల్మీకి మనోనేత్రాల ముందు కనిపించేలా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. కాబట్టే, రామకథలో జీవకళ ఉట్టి పడుతుంది.
శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ నేలను పాలించాడు. ఆ సమయంలో సకాల వర్షాలు కురిసేవట. ముక్కారు పంటలు పండేవట! క్రూరమృగాల నుంచీ క్రిమికీటకాల నుంచీ ప్రభుత్వం ప్రజలకు రక్షణనిచ్చేదట! జనానికి ఆకలి అంటేనే తెలియదట! రామరాజ్య స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వమూ అనేక సంక్షేమ పథకాలకు ప్రాణం పోసింది.
రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రశాసతి! రాముడి పాలనలో ఎవరి నోట విన్నా రామనామమే, ఎవరిని కదిలించినా రామకథలే! సర్వం రామమయం!
-అరవింద్ ఆర్య