నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2020-21)ని గెలిచి స్వదేశానికి చేరుకున్నాక ముంబైలో కొంతమంది అభిమానులు రహానే ఇంటివద్ద కంగారూ బొమ్మతో ఉన్న ఒక ప్రత్యేకమైన కేక్ను తయారుచేయించి దానిని కట్ చేయాలని కోరారు. అప్పుడతడు ఆ బొమ్మను తొలగిస్తేనే కట్ చేస్తానని చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాము గెలిచింది ఆటలో కానీ ఆ దేశానికి గర్వకారణమైన జాతీయ జంతువును అగౌరవపరచడం తమ అభిమతం కాదని అతడు చెప్పకనే చెప్పాడు. రహానే వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు. భావోద్వేగాలకు నిలయమైన క్రికెట్లో ఎక్కడా తన ప్రశాంతతను కోల్పోకుండా తన తోటి ఆటగాళ్లకే గాక ప్రత్యర్థులనూ నొప్పించకుండా ఆటలో వారితోనే శభాష్ అనిపించుకున్న అతికొద్దిమంది గొప్ప క్రికెటర్లలో రహానే ఒకడు.
ఈ ముంబై క్రికెటర్ గురువారం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేస్తూ… ‘నా కెరీర్లో స్వార్థం చూసుకోకుండా ఎల్లప్పుడూ నా దేశం, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. పూర్తి నిజాయితీతో ఈ ఆట ఆడాను.అజింక్యా అంటే ఓటమి లేనివాడని అర్థం. కానీ క్రికెట్ నాకు ఎన్నోసార్లు ఓటములను చూపించింది. క్రీడాకారులుగా మేము సాధించే విజయాల కంటే పొందే వైఫల్యాలే ఎక్కువ. నా జట్టు మ్యాచ్లు ఓడింది, నేనూ తప్పులు చేశాను. కానీ అభిమానుల హృదయాల్లో నేను ఎప్పుడూ ఓడిపోలేదు’ అని కన్నీటితో చెప్పాడు. 2011 నుంచి 2023 దాకా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
అది 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆడేది ఆస్ట్రేలియా సొంతగడ్డపై.. తొలి టెస్టు జరిగిన అడిలైడ్లో కంగారూ పేసర్ల ధాటికి 36 పరుగులకే ఆలౌటైన భారత్కు అవమానకర ఓటమి.. దీనికి తోడు వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిరీస్కు దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో సారథ్య పగ్గాలు అందుకున్న వారెవరైనా విజయం సంగతి దేవుడెరుగు.. సిరీస్ ముగిస్తే అదే పదివేలు అనుకుంటారు. అదీగాక ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఓడి మళ్లీ సిరీస్లో పుంజుకున్న దాఖలాలే లేవు. కానీ నాయకత్వ పగ్గాలు అందుకున్న రహానే మాత్రం పాత పుస్తకాల దుమ్ముదులుపుతూ నవచరిత్రను లిఖించాడు.
అంతగా అనుభవం లేని జట్టును అతడు ముందుండి నడిపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అడిలైడ్ అపజయం తర్వాత రెండో టెస్టు జరిగిన మెల్బోర్న్లో సారథిగా సెంచరీ (122) చేసి తన జట్టుకు స్ఫూర్తినిస్తూ టీమిండియా విజయానికి బాటలు వేశాడు. మూడో టెస్టు డ్రా. గబ్బాలో నాలుగో టెస్ట్. హేజిల్వుడ్, కమిన్స్, స్టార్క్ త్రయం.. భారత బ్యాటర్ల తలలను లక్ష్యంగా చేసుకుని సందిస్తున్న బౌన్సర్లను పుజారాతో తట్టుకుని జట్టుకు ధైర్యం నూరిపోయడంలో రహానేది కీలకపాత్ర.
అప్పటికీ అంతర్జాతీయ అనుభవం లేని సిరాజ్, శార్దూల్, నటరాజన్, వాషింగ్టన్, పంత్, గిల్ వంటి యువకులతో ఆసీస్కు ముచ్చెమటలు పట్టించి సిరీస్ను చేజిక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. యువ జట్టుతో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినా గబ్బాలో నిర్వహించిన సెలబ్రేషన్స్లో పంత్కు జాతీయ జెండాను అప్పగించి తాను రెండో వరుసలోకి వెళ్లిపోయి నిలుచోవడం రహానే నాయకత్వ లక్షణానికి మరో ఉదాహరణ. టెస్టుల్లో అతడు 6 మ్యాచ్లకు సారథిగా ఉంటే ఓటమన్నదే లేకుండా నాలుగింట్లో గెలిచి రెండింటిని డ్రా చేసుకున్నాడు.
రహానే స్వదేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ విజయవంతమయ్యాడు. రహానే తన టెస్టు కెరీర్లో 5,077 రన్స్ చేయగా అందులో విదేశీ పిచ్లపై 51 టెస్టులు ఆడి 39.43 సగటుతో 3,234 రన్స్ సాధించడం గమనార్హం. తన కెరీర్లో 12 శతకాలు సాధిస్తే అందులో 8 విదేశాల్లో చేసినవే. రహానే.. చివరిసారి 2023లో వెస్టిండీస్తో సిరీస్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు.
గవాస్కర్, వెంగ్సర్కార్, సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్లు వచ్చిన ముంబై నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రహానేకు రావాల్సినంత గుర్తింపు రాలేదని కాదనలేని సత్యం. రహానే ఆడిన కాలంలోనే భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాటింగ్ విన్యాసాలతో సచిన్ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్కు కర్త, కర్మ, క్రియ అయ్యారు. మీడియా సైతం వీరి చుట్టే తిరిగింది. టెస్టుల్లో వీరికి తోడు పుజారా.. ద్రవిడ్ను మరిపిస్తూ ‘నయా వాల్’గా గుర్తింపు పొందాడు.
కానీ రహానే మాత్రం ఎన్నడూ గుర్తింపు కోసం పాకులాడలేదు. స్టార్గా ఎదిగినా దేశవాళీల్లో తనను తాను సానబెట్టుకుంటూ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. తన పని అయిపోయిందన్నప్పుడల్లా తానెంటో నిరూపించుకున్నాడు. తన ఆటపై ఎన్ని విమర్శలు వచ్చినా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ నిస్వార్థ సేవకుడిగా జట్టుకు సేవలందించిన రహానే.. తన కెరీర్నూ హంగూ ఆర్భాటాలు లేకుండా అంతే నిశ్శబ్దంగా ముగించడం కొసమెరుపు!