యుగాలు మారినా నిత్యనూతనం శ్రీరామచరితం. ధర్మనిష్ట, సత్యసంధతతో దైవాంశ మూర్తీభవించిన పరిపూర్ణ మానవుడిగా ఆయన గాథ చిరస్మరణీయం. కొన్ని తరాలుగా వెండితెరను పావనం చేస్తున్న ఈ మహోన్నత ఇతిహాసం మరోమారు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది. సాయిపల్లవి, రణబీర్కపూర్ సీతారాముల పాత్రల్లో నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ ట్రైలర్ను గురువారం బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేశారు.
‘దేవలోకం..భూలోకం.. పాతాళలోకం..ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం..రావణ రాజ్యం’ అంటూ రావణ పాత్రధారి యశ్ సంభాషణలతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘చీకట్లను పారద్రోలేందుకు ప్రతి యుగంలోనూ శ్రీమహావిష్ణువు ఉద్భవిస్తాడు’ అంటూ రాముడిగా రణబీర్కపూర్ ఉపోద్ఘాతం ప్రత్యేకాకర్షణగా నిలిచింది.
ఇందులో సీతారాముల కల్యాణం మొదలుకొని రామరావణ యుద్ధం వరకూ ప్రతీ ఘట్టం అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ హంగులు, నిర్మాణ విలువలతో అబ్బురపరచింది. ఆస్కార్ విజేతలు హాన్స్జిమ్మర్, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం హైలైట్గా నిలిచింది. విశ్వవ్యాప్తమైన ఈ కథను సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో తెరకెక్కించానని దర్శకుడు నితేష్ తివారి పేర్కొన్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ ఏడాది దీపావళి రోజున ప్రేక్షకుల ముందుకురానుంది.