రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఫ్యూచర్సిటీ, రేడియల్రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నది. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు సర్కార్ ఇస్తున్న పరిహారం విషయంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. బాధితులకు పరిహారం అందాల్సి ఉండగా సంబంధంలేని వ్యక్తులు వచ్చి అవాంతరాలు సృష్టిస్తున్నారు. తాము కూడా హక్కుదారులమం టూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అధికారులు పైరవీకారుల మాటలకు వంత పాడుతూ అర్హులకు పరిహారం అం దించడంలేదనే ఆరోపణలున్నాయి. ఫలానా వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. అతడితో మాట్లాడుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూములను కోల్పోయి రోడ్డునపడ్డామని.. వచ్చే పరిహారం కూడా సక్రమంగా రాకుంటే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు.
ఇటీవల కందుకూరు సబ్డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నారు. ప్రభుత్వం భూములిచ్చిన రైతుల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం బాధితులకు పరిహారాన్ని అందించాలి. కానీ, కొందరు కిందిస్థాయి అధికారులు, పైరవీకారులు కుమ్మక్కై అర్హుల విషయంలో పలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు ఆ భూ ముల్లో తమకు హక్కు ఉందంటూ ఫిర్యా దు చేయడంతో అర్హులకు చెక్కులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారితో రాజీ కుదుర్చుకోవాలని రైతులకు ఉచిత సలహాలిస్తున్నారు. దీంతో కొందరు బాధిత రైతులు చెక్కులు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో వచ్చిన పరిహారాన్ని ఫిర్యాదుదారులకు ఫలహారం గా పంపిణీ చేస్తుండగా.. మరికొందరు మాత్రం తమకు వచ్చిన పరిహారాన్ని ఇతరులకు ఇవ్వమంటూ నిరాకరిస్తుండటంతో వారికి అధికారులు చెక్కులు ఇవ్వటం లేదు. రోజుల తరబడి తమవద్దే ఉంచుకుంటున్నారు. తమ పేర్లపై వచ్చిన చెక్కులను ఇవ్వకుండా అధికారులు అడ్డంకులు సృష్టించటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
ఫిర్యాదుదారులు, అధికారుల కుమ్మక్కు!
కందుకూరు సబ్డివిజన్ పరిధిలో సర్కార్ పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నది. ఈ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం కోట్లాది రూపాయల పరిహారం ప్రకటించింది. అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.80 లక్షల చొప్పున.. పట్టా భూములు కోల్పోతున్న వారికి ఎకరానికి కోటికి పైగా పరిహారాన్ని ప్రకటించింది. పరిహారాన్ని పొందే అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కొందరు ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు.. ఆ భూముల్లో తమకు కూడా హక్కు ఉందని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులను విచారణకు ఆదేశించగా.. వారు రైతుల మాటను పట్టించుకోకుండా పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు. ఫలానా వ్యక్తి మీపై ఫిర్యాదు చేశాడు. అతడితో రాజీ కుదుర్చుకోవాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులకు అందాల్సిన పరిహారం ఫిర్యాదుదారులు, అధికారులకు ఫలహారంగా మారింది. తాము తాతల కాలం నుంచి ఈ భూములపై హక్కు కలిగి ఉన్నామని.. ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో తమ పేర్లు ఉన్నా సంబంధంలేని వ్యక్తులు చేసిన ఫిర్యాదులను అధికారులు ఎలా పరిగణనలోకి తీసుకుని తమకు రావల్సిన పరిహారాన్ని ఎందుకు ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.