కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండో రోజూ వర్ష ఉధృతి కొనసాగింది. మంగళవారం రాత్రి మొదలైన వాన, ఎడతెరిపిలేకుండా పడుతూనే ఉన్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తూనే ఉన్నది. కరీంనగర్ జిల్లాలో మోస్తరుగా పడినా.. జగిత్యాల జిల్లాలో ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 48 గంటల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో పలువాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయి.
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్-ఫకీర్ కొండాపూర్ మధ్య ఉన్న వాగుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది. జగిత్యాల -కరీంనగర్ ప్రధాన రహదారిపై కొండగట్టులోని మెహర్బాబా సెంటర్ సమీపంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. అటుగా వస్తున్న వాహనదారుడికి స్వల్పగాయమైంది. కాగా, జిల్లాలో అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 128.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వెల్గటూర్ మండలంలో 103.5, రాయికల్ మండలంలో 101.5 మిల్లీమీటర్లు నమోదైంది. సగటున జిల్లాలోని 20 మండలాల పరిధిలో 77.00 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

కోల్బెల్ట్ జలదిగ్బంధం
పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం పడడంతో రామగుండం కోల్బెల్ట్ ప్రాంతంలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద పోటెత్తి ఇళ్లు నీటమునిగాయి. గోదావరిఖని పైవింక్లయిన్ వంతెన వద్ద వరద ప్రవాహం తగ్గకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్ఎఫ్సీఎల్ ప్రహరీ కూలడంతో వరద వీర్లపల్లిలోని ఇళ్లకు వచ్చి చేరగా, ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో రామగుండం రీజియన్ పరిధిలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేఏక్ పడింది. ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచి పోయాయి. అధికారులు అప్రమత్తమై మోటార్ల ద్వారా క్వారీల్లో నీటిని తొలగించారు. పెద్దపల్లి మండలం సబ్బితంలోని గౌరిగుండాల జలపాతం పరవళ్లు తొక్కుతుండగా, అక్కడికి ఎవరూ వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లోని గోదావరి, మానేరు, చెరువులు, వాగులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
సిరిసిల్ల జలమయం
తెరిపిలేని వానతో సిరిసిల్ల జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో భారీ వృక్షం నేలకూలి మినీ వ్యాన్పై పడగా ఒకరికి గాయాలయ్యాయి. పలు చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేములవాడ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో భారీగా వరద నీరు చేరగా, 25 కుటుంబాలను మున్సిపల్ అధికారులు హరిమల గార్డెన్కు తరలించారు. తెరిపిలేని వర్షంతో మూలవాగు ఉధృతి పెరిగి, మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వాగులో వేసిన పైపులు పూర్తిగా ధ్వంసం కాగా, మామిడిపల్లి రైతులు వాగు అవతలి వైపు ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు వీలులేకుండాపోయింది.
మరో రెండ్రోజులపాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలుపడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్రూంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్ 9398684240ను సంప్రదించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో 100 సమాచారం అందించాలని ఎస్పీ మహేశ్ బీగి తే సూచించారు.

ప్రాజెక్టులకు భారీగా వరద
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. గురువారం రాత్రి వరకు ఎగువ నుంచి రికార్డు స్థాయిలో 4,65,155 క్యూసెక్కులు పోటెత్తగా, యంత్రాంగం అప్రమత్తమైంది. 30 గేట్లు ఓపెన్ చేసి 4,66,155 క్యూసెక్కులను దిగువన గోదావరిలోకి విడుదల చేసింది. అలాగే నంది పంప్హౌస్ ద్వారా బరాజ్లోని మరో 15,750 క్యూసెక్కులను ఎగువకు తరలిస్తున్నది. 20.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బరాజ్లో ప్రస్తుతం 19.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఈఈ పీ రవీంద్రచారి తెలిపారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి 17,242 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. గాయత్రీ పంప్హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులు, మానేరు, మూల వాగుల నుంచి 4500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని, 27.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యాంలో ప్రస్తుతం 8.858 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టుకు కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ద్వారా 1950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 0.795 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ సమీపంలోని మూలవాగు ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతున్నది. 19 అడుగుల పూర్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 15 అడుగుల నీరు చేరింది.
నేడు విద్యా సంస్థలకు సెలవు
భారీ వర్షాలతో జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యగా కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం ప్రకటించిన సెలవుకు బదులుగా రెండో శనివారం పనిదినంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

