బెంగళూరు : కరోనా మహమ్మారికి కట్టడికి కర్ణాటక ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూను అమలు చేస్తుండగా ఆ జాబితాలో కర్ణాటక చేరింది. రాష్ట్రంలో ఒకేసారి రెండు విడుతల కర్ఫ్యూను అమలు చేయనుంది. పూర్తిస్థాయి కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. బుధవారం నుంచి మే 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కరోనా బారినపడ్డ సీఎం యడ్యూరప్ప హాస్పిటల్ నుంచి వర్చువల్ విధానంలో ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ బాట పట్టాయి. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నైట్కర్ఫ్యూ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం వారాంతపు లాక్డౌన్కు ఆదేశాలిచ్చింది. అలాగే ఢిల్లీలో సైతం వారం రోజుల లాక్డౌన్ విధించగా.. జార్ఖండ్ ప్రభుత్వం సైతం వారం రోజుల లాక్డౌన్ను ప్రకటించింది. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రమంత్రి వర్గం ‘కఠినమైన లాక్డౌన్’కు అనుకూలంగా ఉంది. దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ప్రకటన చేసే అవకావం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర జాతినుద్దేశించి ప్రసంగిస్తూ లాక్డౌన్ను నిరోధించాలన్నారు. లాక్డౌన్ను చివరి ప్రయత్నంగా ఉపయోగించాలని రాష్ట్రాలకు సూచించారు.