Delhi Police : నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR)’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ (Parliament Street PS) కు బదిలీచేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధాని పదవిని అగౌరవపర్చేలా, శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
అయితే ప్రస్తుతం ఆ బాలికపై కేసును కొనసాగించడం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తన కుమార్తెపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పోలీసులు వయసు 25 ఏళ్లుగా నమోదు చేశారని, కానీ ఆమె వయసు 15 ఏళ్లే అని తన తల్లి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి తన కుమార్తె తప్పు తెలుసుకుని ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. తన కుమార్తెను క్షమించి గొప్ప మనసు చాటుకున్నారని ఆమె ప్రధానిని కొనియాడారు.
18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని ఆమె సూచించారు. చిన్నారులకు తెలియక సులభంగా ఇతరుల ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వారి దృష్టి చదువులపైనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.