ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కె) ( Mukhra villagers ) గ్రామస్థులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభావం తెలిపారు. గిరిజన, ఆదివాసీల గూడాలను పంచాయతీలుగా చేసి, 10శాతం రిజర్వేషన్ ( Reservations ) కల్పించిన కేసీఆర్ గిరిజన ఆత్మబంధువని కొనియాడారు. ఈ సందర్భంగా గురువారం ఎడ్లబండిపై కేసీఆర్ చిత్రపటం పెట్టి, భజనలు చేస్తూ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు.

స్వతంత్ర భారతంలో ఏ నాయకుడు కూడా చేయని విధంగా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్వయంపాలన అందించారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీల సంక్షేమానికి రూ. 37 వేల కోట్లు ఖర్చు చేశారని, లక్షలాది మందికి పోడు పట్టాలు అందించారని గుర్తుచేశారు. గిరిజనులకు రిజర్వేషన్ను 10 శాతానికి పెంచి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాలా ఆదుకున్న నిజమైన ఆత్మబంధువు కేసీఆర్ అని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజనులను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గిరిజనుల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. గిరిజనులు కేసీఆర్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, నాయకులు తిరుపతి, నర్సింగ్, జ్ఞానేశ్వర్, తులసీరామ్, రాంకిషన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.